తాతా ఇక నీ కష్టాలు గట్టేక్కినట్టే.. ముంబై ఆటో డ్రైవర్కు అండగా నిలిచిన నెటిజన్లు!

మనవరాలి చదువు కోసం ఇల్లు అమ్మేసి ఆటోలో కాలం గడుపుతున్న ముంబై ఆటో డ్రైవర్ కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఎందర్నో కదిలించింది.
మనవరాలి చదువు కోసం ఇల్లు అమ్మేసి ఆటోలో కాలం గడుపుతున్న ముంబై ఆటో డ్రైవర్ కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఎందర్నో కదిలించింది. ప్రంపచం నలుమూలల నుంచి దాతలు స్పందించడంతో ఏకంగా 24 లక్షల రూపాయలు అతని ఖాతాలో జమ అయ్యాయి. దీంతో ఆటో డ్రైవర్ దేశ్రాజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతిఫలం ఆశించకుండా మంచి మనసుతో మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ పోతే.. తగిన ఫలితం ఎప్పటికైనా లభిస్తుంది అనడానికి ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
మనవరాలిని చదివించడం కోసం ఇల్లు అమ్మేసి మరీ ఆటోలో జీవిస్తున్న 74 ఏళ్ల దేశ్రాజ్ కథనం హ్యూమన్స్ ఆఫ్ బొంబాయిగా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన ఇద్దరు కుమారులు మృతి చెందడంతో.. ఇద్దరు కోడళ్లు, నలుగురు పిల్లల్ని చూసుకునే బాధ్యత వృద్ధుడైన దేశ్రాజ్ పై పడింది. దీంతో తనకు జీవనాధారమైన ఆటో రిక్షా నే నమ్ముకున్నాడు. రాత్రింబవళ్లూ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
ఈ క్రమంలో మనవరాలి చదువుకు ఎక్కువ మొత్తంలో ఫీజలు కట్టాల్సి వచ్చింది. అయినా వెనకడుగు వేయకుండా.. ఇల్లు అమ్మేసి మరీ ఫీజును చెల్లించాడు. మనవరాలిని చదవించేందుకు ఆ పెద్దాయన తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆకట్టుకుంది. దేశ్రాజ్ సంకల్పం నెటిజన్లను కదిలించింది. అనేకమంది ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఒక ఫేస్బుక్ యూజర్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సమీకరించేందుకు ముందుకు వచ్చాడు. దీంతో 24 లక్షల రూపాయలపైనే దేశ్రాజ్ ఖాతాలో జమ అయ్యాయని హ్యూమన్స్ ఆఫ్ బొంబాయి వెల్లడించింది. వాస్తవానికి 20 లక్షల రూపాయలే లక్ష్యం కాగా.. దాతల నుంచి అనూహ్య స్పందనతో 24 లక్షలు సమకూరాయి. దీనికి సంబంధించి తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి దేశ్రాజ్ ధన్యవాదాలు తెలిపారు.